గండిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్ గండిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కారులో మొత్తం 12 మంది ఉండగా.. మరికొంతమంది కారులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఘటనా స్థలంలో మరణించిన విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మృతులను నిజాంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.

నిజాంపేటకు చెందిన దివ్యకు వివాహం నిశ్చయం అయింది. దీంతో బ్యాచిలర్‌పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్‌ చేయడానికి కారులో నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్‌ వెళారు. తిరిగి వస్తుండగా అదుపుతప్పిన కారు.. పోచమ్మ దేవాలయం వద్ద నిలిచిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని బెలూన్లు ఓపెన్‌ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి. తీవ్రగాయాలపడంతో దివ్యతోపాటు మరో ఇద్దరు అక్కకడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.