వివాదాల్లో చిక్కుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్‌

డోర్నకల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివాదాల్లో చిక్కుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు తమ ఇంటికి రాలేదని ఎవరైనా తనకు ఫిర్యాదు చేస్తే… దానికి బాధ్యులైన అధికారిని మహిళలతో తన్నిస్తానని హెచ్చరించారు. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యా నాయ‌క్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. వివాదాలకు దూరంగా ఉండే రెడ్యా..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

మ‌హబూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ మండ‌లం గొల్ల‌చ‌ర్ల‌లో అన్ని శాఖ‌ల అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, బీఆర్ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేద‌ని ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే, అందుకు కార‌ణ‌మైన అధికారిని ఆడ‌వాళ్ల‌తో త‌న్నిస్తా అంటూ ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫ‌కీరా తండాలో నీళ్లు రావ‌డం లేద‌ని తెలిసి మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.5 ల‌క్ష‌లు ఇచ్చి 4 నెల‌ల‌వుతోంద‌ని, ఇప్ప‌టికీ ప‌ని పూర్తిచేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇలాగైతే ప్ర‌జ‌లు త‌న‌కు ఓట్లు ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ నెల 28 నాటికి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే వెళ్లిన చాలాచోట్ల ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదురువుతున్నాయి. గెలిచినా ఇన్ని ఏళ్లకు మళ్లీ మీము గుర్తు వచ్చామా..? అని ఎక్కడిక్కడే నిలదీస్తున్నారు. అసలు ఆ ఊరికి ఏంచేశారు..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రజల నుండి నిరసనలు ఎదురువుతుండడంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోలీస్ బందోబ‌స్తు పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.