ఇంటి నుంచి చంద్రబాబుకు అల్పాహారం

నేడు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలతో ములాకత్

Chandrababu

విజయవాడః విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబును పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అరెస్టు చూపడానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు, పోలీసుల ఓవరాక్షన్ కారణంగా చంద్రబాబు 48 గంటలుగా నిద్రించలేదని టిడిపి వర్గాలు తెలిపాయి. ఇక ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబు.. తెల్లవారుజామున 4 గంటల వరకూ నిద్రపోలేదని సమాచారం. కోర్టు ఆదేశాలతో అధికారులు చంద్రబాబుకు జైలులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.

ఓ వ్యక్తిగత సహాయకుడు, ఐదుగురు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంటి భోజనానికి కోర్టు అనుమతివ్వడంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆయనకు బ్లాక్ కాఫీ, వేడినీళ్లు, ఫ్రూట్ సలాడ్ పంపించారు. అదేవిధంగా రోజుకు ముగ్గురిని కలిసేందుకు (ములాకత్) కోర్టు అనుమతించడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఈ రోజు ఆయనను కలుసుకోనున్నట్లు సమాచారం. కాగా, సోమవారం చంద్రబాబుకు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.