పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘటనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ అంశం కోర్టులో ఉన్నదని, దానిపై చర్చకు పట్టుబట్టడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే తమ ప్రభుత్వం పాటిస్తున్నదని మంత్రి తెలియజేశారు. అయినా విపక్షల ఎంపీలు వినిపించుకోకపోవడంతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటలకు సభలు ప్రారంభమైన తర్వాత కూడా ఉభయసభల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో ఉభయసభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి.