పూడిమడక బీచ్ లో గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సరదాగా బీచ్ కు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లాలోని పూడిమడక సముద్ర తీరంలో శుక్రవారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నుండి 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఆరుమృతదేహాలను వెలికితీశారు. నిన్న పూడిమడక బీచ్‌కు వచ్చిన 15 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. గల్లంతైన పవన్ సూర్యకుమార్‌ (గుడివాడ) గణేశ్‌(మునగపాక), జగదీశ్‌(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్‌(గుంటూరు), జశ్వంత్‌(నర్సీపట్నం)ల మృతదేహాలను వెలికితీశారు.

పూడిమడక బీచ్‌ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సెమిస్టర్‌ పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే 12 మంది విద్యార్థులు బైక్‌లపై పూడిమడక బీచ్‌కి వచ్చారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగారు.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన అలలు సముద్రంలోకి లాగేశాయి. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను మాత్రం ఒడ్డుకు తేగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.