కాబూల్‌ మసీదులో పేలుడు.. 66 మంది మృతి

తీవ్రంగా గాయపడిన మరో 78 మంది

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ మరోమారు రక్తమోడింది. ఓ మసీదులో జరిగిన శక్తిమంతమైన పేలుడులో 66 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మసీదు కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారిగా రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సున్నీ ముస్లింలే లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. కాగా, పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అభద్రత మధ్య నిత్యం హింసకు గురవుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/