ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Blast-at-Gunpowder-Factory-in-Chhattisgarh.jpg)
బెమెతారా: ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు.
ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.