కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

42 శాతానికి పెరగనున్న డీఏ!

centre-likely-to-hike-dearness-allowance-by-42-percent

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం పెంచి 42 శాతం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల కోటిమందికిపైగా ఉద్యోగులు, పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. ఇందులో భాగంగా గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయించారు. అయితే, కేంద్రం దశాంశ స్థానాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు కాబట్టి, నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.

కేంద్రం చివరిసారి గతేడాది సెప్టెంబరు 28న డీఏను పెంచి అదే ఏడాది జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కాగా, కేంద్రం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏను సవరిస్తుంది. డీఏ పెంపు ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర మంత్రి వర్గం ఎదుట ఉంచుతారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంపు ఉంటుంది. డీఏ పెంపు జనవరి ఒకటి నుంచే అమల్లోకి రానుంది.