భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 66 అడుగులు చేరుకునే అవకాశం..

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధువారం అర్ధరాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. గత ఆరు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం, పక్క రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు పడుతుండడం తో గోదావరికి వరద పోటెత్తుతున్నది. దీంతో ఈరోజు అర్దరాత్రికల్లా 66 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం 54.30 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వాహిస్తోంది.

ఈ నేప‌థ్యంలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధ‌వారం అర్ద రాత్రికి 63 అడుగుల నుంచి 66 అడుగుల వ‌ర‌కు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికార‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గ‌తంలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి 60 అడుగుల‌కు పైగా ప్ర‌వ‌హించిన సంద‌ర్భాలు ఉన్నాయి. 66 అడుగులు దాటి ప్ర‌వ‌హించిన సంద‌ర్భాలు కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు 60 అడుగుల పైన గోదావ‌రి వ‌ర‌ద కొన‌సాగింది ఏడు సార్లు మాత్రమే.

అవి ఎప్పుడంటే..1976 జూన్ 22న మొదటిసారి 63.9 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి రికార్డు క్రియేట్ చేసింది. 1983, ఆగ‌స్టు 14న 63.5 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ఉధృతి కొన‌సాగింది. ఈ రెండు రికార్డులు 1986లో క‌నుమ‌రుగ‌య్యాయి. అదే ఏడాది ఆగ‌స్టు 16న 75.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి చ‌రిత్ర సృష్టించింది. 1990, ఆగ‌స్టు 24న 70.8 అడుగుల వ‌ద్ద‌, 2006, ఆగ‌స్టు 6న 66.9 అడుగులు, 2013, ఆగ‌స్టు 3న 61.6 అడుగులు, 2020, ఆగ‌స్టు 17న 61.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించింది.