గ్రూప్-1 పరీక్ష నిర్వహించే సత్తాలేని కెసిఆర్‌ సర్కారు ఇదిః బండి సంజయ్

bandi-sanjay

హైదరాబాద్‌ః పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించే సత్తాలేని సర్కార్ కెసిఆర్‌ది.. అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని గుర్తు చేశారు. మళ్లీ కమిషన్ నిర్లక్ష్యం వల్ల మరోసారి పరీక్ష రద్దవ్వడంతో.. అభ్యర్థులు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయని బండి సంజయ్ అన్నారు.

యువత భవిష్యత్‌ నాశనమవుతుంటే సిఎం కెసిఆర్‌ నోరెత్తటం లేదని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొన్నారు. “రూ.లక్షలు ఖర్చు చేసిన పరీక్షకు సిద్ధమైన వారికీ ఉద్యోగాలపై ఆశ లేకుండా పోయింది. టెన్త్‌, ఇంటర్‌, గ్రూప్‌ -1 సహా అన్ని పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాకే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓట్లు అడగాలి”’’ అని డిమాండ్‌ చేశారు.