ఫంక్షన్స్ ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సమావేశాలను బహిష్కరించింది

కేసీఆర్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: బండి సంజ‌య్‌

హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేవలం ఫంక్షన్స్ ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ పార్టీలూ ఒకటేనని.. పార్లమెంటులో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అన్నారు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని చెప్పారు.

ఫైళ్లపై సంతకాలు చేసేటప్పుడు సీఎం కేసీఆర్ సోయిలో ఉండాలని అన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సంతకం చేశారని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేశారని… రేపు దేనిపై సంతకం చేస్తారోనని ఎద్దేవా చేశారు. ప్రతి గింజను కొంటానని మాట తప్పిన చరిత్ర కేసీఆర్ దని అన్నారు. కేసీఆర్ దేశానికి ఉపరాష్ట్రపతి అవుతారంటూ ప్రచారం చేయించుకుంటున్నారని… కేసీఆర్, ఆయన మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/