గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారు: పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్ః గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవన్ అని తెలిపారు. ప్రజా భవన్కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని ఆరోపించారు. రెండు నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని అడిగారు. ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.