ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీః సిఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశారు. 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బిజెపికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో కూడా బిజెపి విఫలమైందని అన్నారు. తమకు 62 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, ఓ సభ్యుడు జైల్లో ఉండగా, మరో సభ్యుడు శాసనసభ స్పీకర్ అని పేర్కొన్నారు.
కాగా, ఆప్ సర్కార్ను కూల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి ప్రలోభాల నేపధ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/