ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూరిటీ చీఫ్ అరుణ్ కుమార్ మృతి

కాలేయ సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస

arun-kumar-sinha-spg-chief-responsible-for-pm-modis-protection-passes-away

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా (61) అనారోగ్యం కారణంగా బుధవారం కన్నుమూశారు. అరుణ్ కుమార్ 1987వ బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఎస్పీజీ చీఫ్ గా వెళ్లడానికి ముందు ఆయన కేరళ రాష్ట్ర అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. అరుణ్ కుమార్ ఎస్పీజీ చీఫ్ గా రావడానికి ముందు 15 నెలల పాటు ఆ కీలక పదవి ఖాళీగా ఉంది.

ఈ ఏడాది మే నెలలో ఎస్పీజీ డైరెక్టర్ జనరల్ గా ఆయన పదోన్నతి పొందారు. ఎస్పీజీ అనేది ప్రస్తుత, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంటుంది. ఇందిరాగాంధీని భద్రతా సిబ్బందే కాల్చి చంపిన నేపథ్యంలో 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. కాలేయ సంబంధిత అనారోగ్యంతో హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుణ్ కుమార్ చేరగా, పరిస్థితి చేయి దాటిపోవడంతో మరణించారు. 2016 నుంచి ఎస్పీజీ చీఫ్ గా పనిచేస్తున్నారు. ప్రధాని మోడీ భద్రతా ఇన్ చార్జ్ గానూ వ్యవహరిస్తున్నారు. గతేడాది ఆయన సర్వీస్ ను కేంద్ర సర్కారు పొడిగించింది.