ఏపీ పదో తరగతి ఫలితాల తేదీ ప్రకటించిన బొత్స
మే 6న ఫలితాలు వస్తాయన్న బొత్స
అమరావతిః ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. అయితే ఫలితాల విడుదలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మే 5వ తేదీన విడుదల అని, కాదు మే 7వ తేదీన అని… ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఫలితాల విడుదల అంటూ కూడా ఊదరగొడుతున్నారు. దాంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది.
దీనిపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనే అధికారికం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల సందర్బంగా బొత్స ఈ విషయం తెలిపారు.