జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు షాక్ : సినిమా టికెట్ల‌పై జీవో స‌స్పెండ్

ప్రభుత్వ జీవోను హైకోర్టులో సవాల్ చేసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు

అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట కలిగింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సరికొత్త జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.

ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలను వినిపించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని వీరు కోర్టుకు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. వీరి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును పిటిషనర్లకు కల్పించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/