2018 గ్రూప్ -1 మెయిన్స్‌ రద్దుః ఏపీ హైకోర్టు

ap high court
ap high court

అమరావతి : 2018 గ్రూప్ -1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కరోనా కాలంలో గ్రూప్ -1 ప్రశ్నపత్రాలను ఏపీపీఎస్సీ డిజిటల్ గా మూల్యాంకనం చేసింది. ప్రశ్నాపత్రాలను డిజిటల్ గా మూల్యాంకనం చేయడంపై హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు. మళ్లీ తిరిగి మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేయడంతో క్వాలిఫై కానీ కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పును ప్రకటించింది. పలుమార్లు మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయడంతోపాటు.. మళ్లీ పరీక్ష నిర్వహిచాలని, ఎంపిక ప్రక్రియను ఆరు వారాల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు తీర్పుపై గ్రూప్ -1 ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడతామని, వారి తరపున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.