రాజధాని రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.

రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. రైతుల పాదయాత్రకు షరతులతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు, కూలీలు సిద్ధమవుతున్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/