ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP assembly
AP assembly

అమరావతిః ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు జరగనున్నట్లు సర్కార్ తాజాగా నిర్ణయించింది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశమున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది.

అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్‌ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కోరిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

వీటితో పాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.