పాలకుర్తి అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు – ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ. 150 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 100 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దర్దేపల్లి-కొండాపూర్ గ్రామాల నాయకులు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు కుళ్లుకుంటున్నాయని, వాటిని ప్రజలు గుర్తించాలన్నారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ ఏర్ప్రాటు చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్లు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. పాలకుర్తి చారిత్రక, అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
అంతకుముందు ఎర్రబెల్లికి కార్యకర్తలు, మహిళలు డప్పు చప్పుళ్లు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు, ఇమ్మడి ప్రకాశ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అభివృద్ధి పనులు, దేవాలయాల పునరుద్ధరణపై క్యాంప్ ఆఫీస్లో రివ్యూ నిర్వహించారు. పనులను ఆగస్టు 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.