తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో మరో లొల్లి..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నిత్యం వివాదాలు , గొడవలు కామనే. పార్టీ ని బలపరచడం కంటే ముందు పార్టీలోని ఇతర నేతలను టార్గెట్ గా పెట్టుకోవడం చేస్తుంటారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఫై నమ్మకం లేకుండాపోతుంది. ఓ లొల్లి సర్దుమణిగింది అనుకునేలోపే మరో కొత్త లొల్లి మొదలవుతుంది. తాజాగా అలాగే కొత్త లొల్లి స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం. వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ని TSని TGగా మారుస్తాం. సబ్బండ వర్గాలను ప్రతిబింబించేలా అసలైన తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఓ జెండా రూపకల్పన చేస్తాం’ అంటూ రీసెంట్ గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ లో రచ్చలేపుతున్నాయి. మాతో చర్చించకుండా మీ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చేస్తారా?.. విగ్రహాలు మార్చేస్తారా? అని రేవంత్ రెడ్డిపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందెశ్రీ రాసిన పాటపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ తల్లికి కూడా గులాబీ రంగులు అద్దేశారనీ. ఈ విగ్రహం అసలు యావత్ తెలంగాణ జాతికి ప్రతిబింబం కాదనీ. కేవలం టీఆర్ఎస్ ప్రతిరూపమనీ కొత్త చర్చ తెరపైకి తెచ్చారు. ఇప్పటివరకూ ఏ రాష్ట్రానికీ ప్రత్యేకంగా జెండా అంటూ లేదు. దేశానికి, రాజకీయ పార్టీలకు జెండాలు ఉంటాయి గానీ మనదేశంలో ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి జెండా లేదని సీనియర్లు అంటున్నారు. వీటిపై గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో భేటీ జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ భేటీలో వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.