8 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసిన చాక్లెట్
చిన్న చాక్లెట్ 8 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన వరంగల్ పిన్నావారి వీధిలో చోటుచేసుకుంది. అమ్మ ఇచ్చిన చాక్లెట్ను చప్పరిస్తూ హుషారుగా పాఠశాలకు వెళ్లిన పిల్లాడు.. విగతజీవిగా ఇంటికి రావడాన్ని చూసి అందరు కన్నీరుమున్నీరు అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే ..
వరంగల్ పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్ స్కూల్లో సందీప్ (8) అనే అబ్బాయి రెండో తరగతి చదువుతున్నాడు. సందీప్ అన్న, సోదరి కూడా ఇదే స్కూల్ లో చదువుతున్నారు. శనివారం తండ్రి కన్గహాన్సింగ్ పిల్లలను ద్విచక్ర వాహనంపై బడికి తీసుకెళ్లేముందు వారికి తల్లి గీత చాక్లెట్లు ఇచ్చింది. వీటిని తింటూనే పిల్లలు బైక్ ఎక్కారు. కాగా, నోట్లో చాక్లెట్తో సందీప్ పాఠశాల మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లాడు. కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. పాఠశాల యాజమాన్యం సమాచారం అందించడంతో కన్గహాన్సింగ్ హుటాహుటిన వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే ఊపిరాడక అతడు చనిపోయాడు. శనివారం సాయంత్రం సందీప్ అంత్యక్రియలు నిర్వహించారు.
రాజస్థాన్కు చెందిన కన్గహాన్సింగ్ 20 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం వరంగల్కు వలస వచ్చాడు. జేపీఎన్ రోడ్లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తెతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు లైన్లో నివాసం ఉంటున్నాడు. వ్యాపార పనుల్లో భాగంగా కన్గహాన్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు. వస్తూవస్తూ పిల్లల కోసం అక్కడి చాక్లెట్లు తెచ్చాడు. ఆ చాక్లెట్లే తమ కుమారుడి ప్రాణం తీసింది. ఈ ఘటన తో ఆ వీధిలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.