టోల్​ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం : ఓవర్ స్పీడ్ తో అంబులెన్సు బీబత్సం.. ముగ్గురి మృతి

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సు ..ముగ్గురి ప్రాణాలు తీసింది. ఓవర్ స్పీడ్ తో ఒక్కసారిగా బ్రేక్ వేయడం తో వాహనం అదుపుతప్పి.. అక్కడే ఉన్న ఓ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన లో అంబులెన్స్​ కోసం రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ఓ సిబ్బంది గాయపడగా..అంబులెన్సు లో ఉన్న ముగ్గురు మరణించారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఓ టోల్ గేట్ వద్ద జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని ఉడిపి జిల్లా శిరూరు టోల్​ ప్లాజా వద్దకు సైరన్ వేసుకొని అతి వేగంతో అంబులెన్సు వస్తుంది. దీనిని గమనించిన అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన మార్గాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుగా ఉన్న బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు పరుగెత్తారు. ఇదే సమయంలో బారీకేడ్లను గమనించిన అంబులెన్స్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. అప్పటికే అక్కడ వర్షం పడటంతో అంబులెన్స్ స్కిట్ అయ్యింది. సమంత గాల్లో ఎగురుకుంటూ ఓ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. వెనుక డోర్లు తెరుచుకొని అంబులెన్స్‌లో ఉన్న నలుగురు అమాంతం ఎగిరి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పేషంట్‌తో పాటు అతడి భార్య, బంధువు.. మొత్తం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో గాయపడిన టోల్ బూత్‌కు చెందిన సిబ్బంది ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకా వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.