అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు హిందూపురం బంద్!

జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని అఖిలపక్షం డిమాండ్

హిందూపురం: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అఖిలపక్షం పిలుపు మేరకు హిందూపురంలో బంద్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై హిందూపురం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురంను సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని… అయితే, జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ… ఈరోజు హిందూపురం బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హిందూపురం నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/