రాహుల్ జోడో న్యాయ‌ యాత్ర‌లో చేరునున్న అఖిలేష్ యాద‌వ్..!

Akhilesh Yadav to join Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra on February 25

ల‌క్నో : 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ, స‌మాజ్‌వాది పార్టీ మ‌ధ్య పొత్తులు కుదిరిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ – ఎస్పీ కూట‌మికి యూపీలో ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. ఇప్పుడు మ‌ళ్లీ ఒక్క‌టై పోటీ చేస్తున్నాయి. యూపీలో బిజెపిని ఓడిచండ‌మే ల‌క్ష్యంగా ఆ రెండు పార్టీలు ప‌ని చేస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ యాత్ర‌లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ఆగ్రాకు రాహుల్ యాత్ర చేరుకోనుంది. దీంతో ఆ రోజున అఖిలేష్ ఆగ్రాలో రాహుల్‌తో క‌లిసి న్యాయ యాత్ర‌లో పాల్గొంటార‌ని స‌మాచారం.

అయితే అఖిలేష్ యాద‌వ్‌ను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ‌య్ రాయ్, నాయ‌కుడు పీఎల్ పునియా కూడా ల‌క్నోలోని అఖిలేష్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఆగ్రాలోని న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది.