ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని ఏపీ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్‌ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు… రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం.

రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదన్న ధర్మాసనం… రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.