ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం

Aarogyasri services suspended in AP from today

అమరావతిః శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆసుపత్రులు- ట్రస్ట్‌ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఏపీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. నేటి (గురువారం) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి.

నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ ఇప్పుడు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.