పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే క్లారిటీ కూడా లోకేశ్ కు లేదుః మంత్రి రోజా

ఇన్నాళ్లూ చంద్రబాబు దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచారని ఆరోపణ

roja-satires-on-nara-lokesh

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభంకానుంది. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్, ఆయన పాదయాత్రపై ఏపీ టూరిజం మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే క్లారిటీ కూడా లోకేశ్ కు లేదని సెటైర్ వేశారు. ఇది ‘యువ గళం’ కాదని… తెలుగుదేశం పార్టీకి ‘మంగళం’ అని ఎద్దేవా చేశారు. లోకేశ్ ప్రచారం చేసిన ప్రతిచోట టీడీపీ ఓడిపోయిందని అన్నారు. లోకేశ్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని… అలాంటప్పుడు ఆయన పాదయాత్రకు సెక్యూరిటీ ఎందుకని ప్రశ్నించారు.

ఇంతకాలం దొంగ ఓట్లతో కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు గెలిచారని రోజా ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ ఓట్లను తొలగించారని చెప్పారు. టిడిపి హయాంలో ఎన్ని ఉద్యోగాలను కల్పించారో వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల విషయంలో చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/