ఎర్రగడ్డలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. రైతుబజార్‌ సిగ్నల్‌ వద్ద అదుపు తప్పి ఆగిఉన్న రెండు కార్లు, కొన్ని ద్విచక్ర వాహహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. కార్లు ధ్వంసమయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. బుధువారం ఉదయం 6.30 గంటలకు ధనుంజయ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఎర్రగడ్డ నుంచి ఈఎస్‌ఐ వైపును వెళ్తోంది. ఈ క్రమంలో రైతు బజార్‌ ఎదుట సిగ్నల్‌ వద్ద అదుపుతప్పింది. అప్పటికే సిగ్నల్‌ పడటంతో కార్లు, ద్విచక్రవాహనాలు అక్కడ ఆగిఉన్నాయి. ఆ సమయంలో అదుపుతప్పిన బస్సు.. కార్లు, ద్విచక్రవాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. సెయింట్‌ థెరిసా ఆస్పత్రి ముందున్న ట్రాఫిక్‌ బూత్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సార్‌ నగర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.