యూపీలో పార్క్‌కు వచ్చిన జంటకు డబ్బు కోసం పోలీసుల వేధింపులు

రూ. 10 వేలు ఇవ్వకుంటే జైలుకు పంపుతామని బెదిరింపు

A couple who came to a park in UP was harassed by the police for money

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను పార్కులో బెదిరింపులకు గురిచేసి డబ్బులు గుంజడమే కాకుండా నిత్యం వేధింపులకు పాల్పడ్డారు. యువతికి ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బలంద్‌షహర్‌కు చెందిన యువతీయువకుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో సరదాగా గడిపేందుకు పార్క్‌కు వెళ్లారు. అక్కడ వీరిని చూసిన ముగ్గురు పోలీసులు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జైలుకు పంపుతామని భయపెట్టారు. తమను వదిలిపెట్టాలని వేడుకున్నా వారు కనికరించలేదు సరికదా యువకుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను బలవంతంగా తమకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అక్కడితో ఆగకుండగా రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు.

యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెకు నిత్యం ఫోన్ చేస్తూ లైంగికంగా వేధించారు. ఆమెను కలిసేందుకు ఇంటికి కూడా వెళ్లారు. వారి ఆగడాలు మితిమీరడంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్‌గా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని, నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.