జనసేన లోకి క్యూ కడుతున్న సినీ , రాజకీయ ప్రముఖులు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం పార్టీల్లోకి వలసలు వచ్చి చేరుతున్నాయి. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైసీపీ లో చేరగా..ఇప్పుడు టిడిపి – జనసేన కూటమి లో చేరుతున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలలో పలువురు రాజకీయ నేతలు చేరగా…తాజాగా జనసేన పార్టీ లోకి సినీ ప్రముఖులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి , ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లు చేరారు.

బుధువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కొద్దికాలంగా పృథ్వీరాజ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో జనసేనకు మద్దతు పలుకుతూ వచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ లో చేరారు. ఈయన తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. కండువా కప్పి జానీ మాస్టర్ను పవన్ సాదరంగా ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు.

అలాగే తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ కళ్యాణ్ తో బుధువారం భేటీ అయ్యారు. గూడూరు వైసీపీ టికెట్ మేరీగ మురళికి అధిష్ఠానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వరప్రసాద్.. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పవన్ను కలిశారు.