ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
బిలాస్ పూర్: చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో శుక్రవారం( ఈరోజు) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోడీ ర్యాలీకి వెళ్తున్న బిజెపి కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. అంబికాపూర్ నుంచి రాయ్పూర్ కు 40 మందితో బస్సు వెళుతుండగా బెల్తారా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని బిలాస్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సంతోష్ సింగ్ తెలిపారు. మృతులు సూరజ్పూర్ జిల్లాకు చెందిన సాజన్ (30), రుక్దేవ్ (45), బల్రాంపూర్ జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ అక్రమ్ రజా (28)గా గుర్తించారు.