మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థత..

మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి వీవర్స్ కాలనీలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. మొత్తం ఈ స్కూల్ లో 148 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వారిలో పాఠశాలకు 121 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. నిన్న స్కూల్లో వండిన భోజనం మాడిపోవడం గమనించిన విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు లావణ్య దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆమె భోజనం తిరిగి వండాలని భోజన ఏజెన్సీ నిర్వాకులకు సూచించారు. దాంతో వారు భోజనం ఉడక్క ముందే దించేంసి పిల్లలకు వడ్డించారు. ఇందులో 25 మంది విద్యార్థులు తిన్న వెంటనే వాంతులు, కడుపునొప్పితో బాధఫడ్డారు. వారిని స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం స్టూడెంట్స్ అందరూ కోలుకుంటున్నారు.

ఈ ఘటన పట్ల పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను జిల్లా వైద్యాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆహార పదార్థాల నాణ్యత వంటి కారణాలతో పిల్లలు అస్వస్థతకు గురై ఉండొచ్చని ఆయన తెలిపారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిబాబు, ఇతర పార్టీ నాయకులు విద్యార్థులను పరామర్శించారు.