తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు వారంతా పోటీ చేసినప్పుడు తమ ఖర్చుకు సంబంధించిన వివరాలు సమర్పించలేదు. దీంతో వారిని కేంద్ర ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించి వేటు వేసింది. వారిలో 72 మంది లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడం విశేషం. ఎలక్షన్ కమిషన్ వేటుకు గురైన వారిలో ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకర్గానికి చెందినవారే 68 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

మిగతా వారిలో మెదక్, మహబూబాబాద్ నుంచి ఒక్కొక్కరు, నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఇద్దరు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అనర్హత వేటుకు గురైన వారి సంఖ్య 35. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద వీరందరి పైనా అనర్హత వేటు పడింది. వీరిపై అనర్హత వేటు 2021 జూన్ నుంచి వర్తించనుంది. 2024 జూన్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.