సమస్యకు ప్రైవేటీకరణ పరిష్కారం కాబోదు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సిపి వైఖరిని వెల్లడించిన పిల్లి సుభాష్ చంద్రబోస్

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉందంటూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని నిశ్చయించుకోవడం పట్ల ఏపీ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పాయి. తాజాగా ఈ అంశంపై వైఎస్‌ఆర్‌సిపి వైఖరిని ఆ పార్టీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వైఎస్‌ఆర్‌సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎంతో కాలం పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటు పరం కావడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.

ఈ పరిశ్రమపై లక్ష కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, స్టీల్ ప్లాంట్ బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని, స్టీల్ ప్లాంటకు సొంతంగా గనులు కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. ఇదే అంశంపై సిఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని, ఈ ప్లాంట్ ను మూడు దశల్లో పునరుద్ధరించాలని కోరారని వెల్లడించారు.