జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
149 మంది కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. సభ్యులతో సామూహికంగా ఎన్నికల నిర్వహణ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, తర్వాత ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏదైనా ఒక భాషలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. మేయర్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఇందుకు సంబంధించి నిబంధనల ప్రకారం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి హాజరైన 149 మంది కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు.
మేయర్, ఉప మేయర్ ఎన్నికల ప్రక్రియను కార్పొరేటర్లకు వివరించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సమావేశాన్ని వాయిదా వేశారు. 12.20 గంటలలోగా కొత్త కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు. మేయర్, ఉప మేయర్ ఎన్నిక ఉంటుందని ప్రకటించారు. కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు, సెక్యూరిటీ విభాగం, సీపీఆర్ఓ సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు మాత్రమే వచ్చారు. మిగతా సిబ్బందికి సెలవు ఇచ్చారు.