రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం రమేష్

,

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేష్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం రమేశ్… 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీఎం రమేశ్… వరుసగా పదేళ్లకు పైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం పార్లమెంటులో ఆయన రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయనకు హౌస్ కమిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన రమేశ్… కమిటీకి చెందిన కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి రాజధానిలో సర్కారీ బంగ్గాలను కేటాయించడం, పదవీ కాలం పూర్తయిన సభ్యులను ఆయా బంగ్లాల నుంచి ఖాళీ చేయించడం కూడా ఈ కమిటీ బాధ్యతే. ఇక సభ్యులకు కేటాయించిన బంగ్లాల్లో ఆయా సౌకర్యాల ఏర్పాటును కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది.