ఆగస్టు 15 వరకు గంగోత్రి ఆలయం మూసివేత
15 వరకు భక్తులను అనుమతించబోము..ఆలయం సమితి అధ్యక్షుడు
డెహ్రాడూన్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ గంగోత్రి ఆలయాన్ని ఆగస్టు 15 వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు గంగోత్రి ఆలయం సమితి అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ తెలిపారు. గంగోత్రి ధామ్కి వచ్చే వారిని 2 కిలోమీటర్ల అవతలే నిలువరిస్తామని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ అంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్ర చేస్తుంటారు. యమునోత్రి నుంచి మొదలయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగి బద్రీనాథ్ ఆలయం సందర్శనతో ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో కొంత కాలంపాటు నిలిచిపోయిన చార్ధామ్ యాత్రను ఇటీవల పునరుద్ధరించారు. అయితే ఈ యాత్రకు వెళ్లే భక్తులు ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్ నుంచి కరోనా పరీక్ష చేయించుకుని ఆ రిపోర్టుతో ఈ పాస్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/