భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం..
![](https://www.vaartha.com/wp-content/uploads/2022/08/Earthquakes-in-Nellore-and-.jpg)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం భూమి కొద్ది క్షణాలు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులుపెట్టారు. పాల్వంచలో సరిగ్గా రెండు గంటల పదమూడు నిమిషాలకు భూమి ప్రకంపించింది. భూమి ప్రకంపించటంతో.. ఇళ్లలోని వస్తువులు వాటంతట అవే కింద పడిపోయాయి. కొన్ని చోట్ల గోడలు బీటలు వారినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెపుతున్నారు.
భూ ప్రకంపనలు వచ్చిన ఆ కొన్ని క్షణాలు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయటంతో.. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటికే.. అంతా సద్ధుమణగటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండకుండా.. బయటకు రావాలని సూచిస్తున్నారు. అయితే.. భూకంప తీవ్రత ఎంత మేర ఉందని మాత్రం అధికారులు వెల్లడించాల్సి ఉంది.