తెలంగాణ వ్యాప్తంగా మే 17 నుండి థియేటర్స్ మూసివేత

సినీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. మే 17 నుండి రెండు వారాల పాటు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. మాములుగా ఎండాకాలంలో చాల సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దీనికి కారణం ఎన్నికలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. అంతేకాకుండా ఈ సారి సమ్మర్ టార్గెట్ గా చిన్నా చితక, పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు పడటం లేదు. కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ.. చిన్న సినిమాలను ఆడిస్తున్నారు ధియేటర్ల యజమానులు.

అయితే చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించటం లేదు. ఈ క్రమంలోనే ధియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవటం.. నష్టాలు వస్తుండటం.. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో.. ధియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు.