అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదుః షర్మిల

అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల

ys-sharmila-sent-kcr-ambedkar-written-constitution

హైదరాబాద్‌ః నేడు అంబేద్కర్ జయంతి ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాదులో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కెసిఆర్ కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకాన్ని పంపించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని విమర్శించారు. “80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కెసిఆర్ గారూ… మేం పంపిన రాజ్యాంగం పుస్తకాన్ని తీరిగ్గా చదివి, బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నా. నియంత పాలన మానుకుని, ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులు కల్పించాలని మనవి చేస్తున్నాం” అని షర్మిల పేర్కొన్నారు.

గతంలో రాజ్యాంగం మార్చేయాలని కెసిఆర్ ఎందుకు అన్నారో చెప్పాలని షర్మిల నిలదీశారు. తెలంగాణలో కెసిఆర్ రాజ్యాంగం నడుస్తోందని, అంబేద్కర్ వారసుడు కెసిఆర్ అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని, అంతకంటే పెద్ద జోక్ ఇంకేముంటుందని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్థాన్ అయితే, సీఎం కేసీఆర్ ఒక తాలిబన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల భూములు లాగేసుకుంటూ, దళితులను జైళ్లలో చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారు… ముఖ్యమంత్రికి సిగ్గులేకపోతే సరి అని వ్యాఖ్యానించారు.