మరోసారి డీకే శివకుమార్‌తో వైఎస్‌ షర్మిల భేటి

ys-sharmila-meets-karnataka-dy-cm-dk-shivakumar-in-bengaluru

బెంగళూరుః కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్‌ షర్మిల ఈరోజు ఉదయం మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు షర్మిల అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌టిపికి పొత్తు ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కొన్ని నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున వారి మధ్య రాజకీయ పొత్తుల అంశంపై చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. వీరి భేటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారిగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆమె బెంగుళూరులో డీకే శివకుమార్‌ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిలకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.