మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలేనా? : షర్మిల

నిన్న హైదరాబాదు వచ్చిన ప్రధాని మోడీ
అదే సమయంలో కేసీఆర్ బెంగళూరు పర్యటన
మీరెక్కడికి పారిపోయారంటూ ప్రశ్నించిన షర్మిల

హైదరాబాద్ : ప్రధాని మోడీ నిన్న హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మోడీ నగరానికి వచ్చిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. “ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారూ… మోడీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు?” అంటూ షర్మిల ప్రశ్నించారు. “మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు? మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేకపోయావా?” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టు మోడీ గారొస్తే పిరికివాడి లాగా పారిపోయావా?” అంటూ ఎద్దేవా చేశారు.

“కేసీఆర్ పాలన అవినీతిమయం అని మోడీ చెబుతారు. మోడీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ, ఇద్దరూ ఎదురుపడరు, అవినీతిని బయటపెట్టరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలేనా? లేక, ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టకూడదని చీకటి ఒప్పందాలేమైనా చేసుకున్నారా?” అంటూ షర్మిల నిలదీశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/