నాకేం జరిగినా పూర్తి బాధ్యత కెసిఆర్‌దే: షర్మిల

సిఎం కెసిఆర్ డైరెక్షన్లో పోలీసులు తనను రిమాండ్ చేయాలనుకున్నారని వ్యాఖ్య

ys-sharimla-comments-on-trs

హైదరాబాద్ః తెలంగాణలో తన పాదయాత్రను టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నాయని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో తనపై దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ధ్వంసమైన వాహనంలో ప్రగతి భవన్ కు వెళ్తుండగా పోలీసులు తనను అరెస్ట్ చేసిన వైనం, తాను కూర్చున్న కారును టోయింగ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తీరుపై షర్మిల.. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..సిఎం కెసిఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా మార్చేశారన్నారు. తాలిబన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబన్లే అని ఎద్దేవా చేశారు. కేవలం ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన కేసులో తనను అరెస్టు చేశారని, మహిళను అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్ లో విచారించడంతో పాటు తన వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ‘ఈ కేసులో సిఎం కెసిఆర్ సూచన మేరకు నన్ను రిమాండ్ చేయాలని పోలీసులు అనుకున్నారు. రిమాండ్ ఎందుకు చేస్తారు? నేనేమైనా నేరం చేశానా? నా నుంచి ఏమైనా ఆధారాలు సేకరించాలా? అందుకే జడ్జీ రిమాండ్ కు అనుమతించలేదు’ అని పేర్కొన్నారు.

తన పాదయాత్రలో కెసిఆర్ అవినీతి గురించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నానని షర్మిల చెప్పారు. అందుకే టిఆర్ఎస్, కెసిఆర్ కుటుంబం తనను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబం వేల కోట్లను అక్రమ మార్గంలో సంపాదించారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబమే దేశంలో అత్యంత ధనవంతమైన రాజకీయ కుటుంబం అన్నారు. పాదయాత్రలో తనపై, తమ నాయకులపై దాడులు చేసేందుకు టిఆర్ఎస్, ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు, తమ పార్టీ నాయకులకు ఏం జరిగినా దానికి కెసిఆ

ర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/