బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలంటూ కేంద్రానికి యనమల లేఖ

ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ ఏర్పటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది. కాగా ఈ పార్క్ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ కేంద్రానికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాసారు. కాకినాడలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఆయన కోరారు. ఈ లేఖ కాపీలను జాతీయ హరిత ట్రైబ్యునల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.

ఇక్కడ సెజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి అప్పటి వైయస్ ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందని.. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలిపారని యనమల అన్నారు. అయితే, అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఫార్మా పార్క్ వల్ల నేల, నీరు, వాయు, సముద్రం కలుషితమై రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని యనమల లేఖలో పేర్కొన్నారు. మరి పార్క్ ఫై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.