నిద్రాణస్థితిలోకి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లుః ఇస్రో ట్వీట్

పేలోడ్స్ స్విచ్చాఫ్ చేసినట్లు వెల్లడించిన ఇస్రో
ల్యాండర్ రిసీవర్లు ఆన్‌లో ఉంచినట్లు తెలిపిన అంతరిక్ష పరిశోధన సంస్థ

Vikram Lander is set into sleep mode .. ISRO

బెంగళూరుః విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణస్థితిలోకి వెళ్లాయి. విక్రమ్ ల్యాండర్ గం.08:00 సమయంలో స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్ చేయబడినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. పేలోడ్స్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని, ల్యాండర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు పేర్కొంది. సోలార్ పవర్ తగ్గి, బ్యాటరీ అయిపోయాక ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ రోవర్ నిద్రాణస్థితిలోకి వెళ్తుందని వెల్లడించింది. తిరిగి సెప్టెంబర్ 22, 2023న అవి తిరిగి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. శివశక్తి పాయింట్ వద్ద 22న సూర్యోదయం అవుతుంది. అప్పుడు సూర్యకాంతితో రోవర్ యాక్టివేట్ అయ్యేలా సోలార్ ప్యానెల్‌ను మార్చినట్లు ఇస్రో తెలిపింది. రోవర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు తెలిపింది.

అంతకుముందు రోవర్ మళ్లీ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను మించి విక్రమ్ పనితీరును కనబరిచిందని, అది విజయవంతంగా హాప్ ఎక్స్‌పెరిమెంట్‌ను పూర్తి చేసిందని తెలిపింది.

ఆదేశాలకు అనుగుణంగా ఇంజిన్లను మండించి, అనుకున్న విధంగా 40 సెంటీ మీటర్లు గాల్లోకి లేచి, 30 నుండి 40 సెంటీ మీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపింది. భూమి పైకి నమూనాలను తీసుకు రావడానికి, మానవసహిత యాత్రల విషయంలో ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపింది. ఈ ల్యాండింగ్ తర్వాత కూడా అన్ని వ్యవస్థలను సక్రమంగానే పని చేస్తున్నాయని వెల్లడించింది.