పూరి..జనగణమన లేనట్లేనా..? విజయ్ మాటలు వింటే అలాగే ఉంది..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. ఈ కథ గత కొన్నేళ్ల క్రితం రాసిపెట్టుకున్నాడు. మహేష్ , పవన్ కళ్యాణ్ లతో చేయాలనీ అనుకున్నాడు..వారు కూడా మొదట్లో చేద్దాం అన్నారు కానీ తర్వాత పక్కకు పెట్టారు. దీంతో వెయిట్ చేసి చేసి..చివరకు విజయ్ దేవరకొండ తో స్టార్ట్ చేసాడు. కానీ ఇప్పుడు లైగర్ దెబ్బకు జనగణమన ఆగిపోయినట్లే అనిపిస్తుంది.

పూరి డైరెక్షన్లో హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్యపాండే జంటగా నటించిన లైగర్, ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. లైగర్‌ సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతో తన డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’ ప్రారంభిస్తున్నట్లు చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రకటించారు. చిన్న షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ లైగర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దర్శక, నిర్మాతలు జనగణమన పై ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఈ ప్రాజెక్టుకి నిర్మాతలుగా వ్యవహరించిన పూరీ జగన్నాథ్‌, ఛార్మీలు(పూరి కనెక్ట్స్‌ యజమానులు) సైతం జనగణమన పై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కనీసం జనగణమన ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలనూ ఖండించట్లేదు.

ఈ క్రమంలో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు ‘జనగణమన’ చిత్రం ఏమైందని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. సైమా వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని భావిస్తారని, కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోవాలని సమాధానమిచ్చారు. విజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సినిమా ఇక లేదన్న చర్చ మొదలైంది. ‘జనగణమన’ లైవ్‌లోనే ఉండి ఉంటే విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని చెబుతున్నారు.