ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ….31 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్లో భారత సైన్యం రంగప్రవేశం చేసింది. సిల్కియారా సొరంగం లో ప్రస్తుతం నిలువుగా డ్రిల్లింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 31 మీటర్ల మేర డ్రిల్లింగ్ జరిగినట్లు అధికారులు చెప్పారు. సుమారు 86 మీటర్ల కింద 41 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. ఆ కార్మికులను రక్షించేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 800/900 మిల్లీమీటర్లు లేదా 1.2 మీటర్ల వెడల్పు ఉన్న పైప్లైన్ వేసేందుకు డ్రిల్లింగ్ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఉత్తరాఖండ్లో వాతావరణ అనుకూలంగా లేదు. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు, స్నో ఫాల్ ఉంది. నవంబర్ 27వ తేదీన వర్ష సూచన ఉన్నట్లు వెదర్శాఖ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 100 గంటల్లో 86 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయనున్నట్లు రోడ్లశాఖ అదనపు కార్యదర్శి అహ్మద్ తెలిపారు. ఒకవేళ ఎటువంటి ఆటంకం ఎదురుకాకుంటే అనుకున్న సమయానికే డ్రిల్లింగ్ పూర్తి అవుతుందన్నారు. అయితే ఏదో ఒక దశలో మాత్రం డ్రిల్లింగ్ మెషీన్ నీడిల్ను మార్చాల్సి ఉంటుందన్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్ పైప్లో ఏర్పడే శిథిలాల్ని తొలగించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ద్వారా తొలగించనున్నారు. భారతీయ ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూపునకు చెందిన ఇంజినీర్ల బృందం డ్రిల్లింగ్ పనులు పర్యవేక్షిస్తుంది. ఈ బృందంలో ఆరు మంది స్పెషలిస్టులు ఉన్నారు.