ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మృతి పట్ల ఉపాస‌న భావోద్వేగ‌భ‌రిత ట్వీట్‌

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల నిన్న శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె మృతి పట్ల రామ్ చరణ్ భార్య ఉపాసన భావోద్వేగ‌భ‌రిత ట్వీట్‌ చేసింది. ప్ర‌త్యూష‌ను ఉపాస‌న త‌న డియ‌రెస్ట్ ఫ్రెండ్ అంటూ పేర్కొన్నారు. ప్ర‌త్యూష చాలా త్వ‌ర‌గానే వెళ్లిపోయింద‌ని, ప్ర‌త్యూష మ‌ర‌ణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని ఆ పోస్ట్‌లో ఉపాస‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ప్ర‌తి విష‌యంలోనూ ఉన్న‌తంగానే ఉండేవార‌ని..కెరీర్ ప‌రంగా, కుటుంబం, స్నేహితుల ప‌రంగానూ ఉన్న‌త నిర్ణ‌యాలే తీసుకునేద‌ని ఉపాస‌న రాసుకొచ్చింది.

కార్బ‌న్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. త‌న ఇంటిలోని బాత్ రూమ్‌లో ప్ర‌త్యూష విగ‌త జీవిగా ప‌డి ఉన్న విష‌యాన్ని గుర్తించిన ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ప్రాథ‌మిక ఆధారాలు సేక‌రించి ప్ర‌త్యూష మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌హిళా సెల‌బ్రిటీల‌కు డిజైనింగ్‌లో ప్ర‌త్యూష సిద్ధ‌హ‌స్తురాలు. దేశంలోని టాప్ 30 ఫ్యాష‌న్ డిజైన‌ర్ల‌లో ప్ర‌త్యూష కూడా ఒక‌ర‌ని స‌మాచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌తో పాటు ప‌లువురు క్రీడాకారుల‌కు కూడా ఆమె డిజైనింగ్ చేశార‌ని తెలుస్తోంది. ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. మరి ఈమె ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేపడుతున్నారు.