ఉక్రెయిన్‌కు రూ. 150 కోట్లు విడుదల చేసిన ఐరాస

రష్యా దాడి కారణంగా ఆహార ఉత్పత్తుల కొరత
సాయాన్ని వెంటనే పంపిణీ చేస్తామన్న ఐరాస

జెనీవా: రష్యా దాడి నేపథ్యంలో చితికిపోతున్న ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ ఆర్థిక సాయం కింద 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 150 కోట్లు) ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ నిన్న ప్రకటించారు. ఐరాస, దాని మానవతా భాగస్వాములు ఉక్రెయిన్‌ ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని, ఉక్రెయిన్‌లోని ప్రతి మూలలో భయం, వేదన, భయాందోళన నిండిపోయాయని అన్నారు. తాము ప్రకటించిన ఆర్థిక సాయం ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం, ఆహారం, నీటి సరఫరా మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని, ఈ ఆర్థిక సాయాన్ని వెంటనే పంపిణీ చేస్తామని ఐరాస మానవతావాద విభాగం చీఫ్ మార్టిన్ గ్రిపిథ్స్ చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/